శృంగార శతకము 2 459

పట్టాభిషేక మహోత్సవం అతి వైభవంగా నిర్వహించబడింది. చంద్రవర్ణుడు సంతృప్తిగా, మనశ్శాంతిగా అనుభూతించాడు. ఒకనాటి ఉత్తమ ఘడియలలో అతడు దివంగతుడయ్యాడు.

భర్తృహరి కన్యాపురానికి రాజుగా, భట్టి విక్రమాదిత్యులిద్దరూ అన్ని విషయాలనీ పర్యవేక్షిస్తుండగా సుఖంగా ఉన్నాడు. అతడు పెక్కు మంది అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. అతడికి తండ్రికిచ్చిన మాట గుర్తుంది. అందుచేత తన రాణులు ఋతుమతులైన పన్నెండు రోజుల పర్యంతమూ వారి మందిరాలకు వెళ్ళక, ఇతర భార్యలతో గడుపుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఆ విధంగా సంతాన సాఫల్యతని నిరోధించటమన్నది అతడి ఉద్దేశం.

[ఆ రోజులలో సంతాన నిరోధక ఔషధాల వంటివి లేవు కదా!]

ఇలా రోజులు గడుస్తుండగా… ఒకనాడు…

చాంద్యోగ ఋషి అను గొప్ప తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయనని అందరూ సాక్షాత్తు శివ స్వరూపుడని కొనియాడేవారు. ఋష్యోత్తమడైన చాంద్యోగ మహర్షి, ఒకనాడు పదునాలుగు లోకాలను సందర్శించబోయాడు. దేవలోకం నుండి భూలోకానికి వస్తున్నప్పుడు, మార్గవశాన ఆయన ఒకింత సేపు నందనోద్యాన వనంలో విశ్రమించాడు. అక్కడ ఆయన కొక దివ్యఫలం లభించింది.

ఆయన భూలోకంలో ప్రవేశించాక, నేరుగా భర్తృహరి ఆస్థానానికి వచ్చాడు. భర్తృహరి చాంద్యోగ మహర్షిని చూడగానే, ఆ బ్రహ్మతేజస్సు చూసి ఎవరో మహానుభావుడని పోల్చుకున్నాడు. వెంటనే సింహాసనం దిగి వచ్చి, మహర్షికి పాదాభివందనం చేసి, స్వాగత సత్కారాలు చేశాడు.

మహర్షి పాదాలు కడిగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. తన సింహాసనం మీద మహర్షిని కూర్చుండబెట్టి సేవకుడి మాదిరిగా భక్తి శ్రద్దలతో పరిచర్యలు చేశాడు. వినయ విధేయతలతో కూడిన అతడి ప్రవర్తనకు మహర్షి ఎంతో సంప్రీతుడయ్యాడు.

వాత్సల్యంతో “రాజా! భర్తృహరీ! నేను చాంద్యోగ ఋషిని. నా తపశ్శక్తితో పదునాలుగు లోకాల్లోనూ సంచరించ గలవాడిని. నేను స్వర్గలోకములో ఉండగా, ఇంద్రుని నందనోద్యాన వనంలో నాకీ పండు లభించినది. ఇది దివ్య ఫలము. దీని నారగించిన వారు, నిత్య యవ్వనులై జరామరణ భయము లేక యుందురు. నిత్య యవ్వనుడనై, జరామరణాలు లేక నేను బ్రతికిననూ, నా వలన ఈ జగత్తునకుపయోగమేమిటి? నీవీ ఫలమును భుజించినట్లయితే, ధర్మపాలన చేయగలవు. నీ రాజ్య ప్రజలు సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యలతో ఉండగలరు. ధర్మము పరిరక్షింపబడగలదు. కాబట్టి, రాజువైన నీవు ఈ ఫలమును తినుటకు అర్హుడవు. అందుచేత నీకీ ఫలమును కానుకగా నీయవలెనని వచ్చితిని. ఈ దివ్యఫలమును స్వీకరింపుము. నీకు జయమగు గాక!” అని భర్తృహరిని ఆశీర్వదించాడు.

భర్తృహరి భక్తి శ్రద్దలతో పండుని స్వీకరించి, చాంద్యోగ మహర్షికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు. అతిధి సత్కారాలు పొంది, చాంద్యోగ మహర్షి వీడ్కొలు తీసుకున్నాడు.

రాచకార్యాల అనంతరం, భర్తృహరి తన అంతఃపురానికి వెళ్ళాడు. అతడికి ఎందరో రాణులున్నా, పట్టపు రాణి మోహనాంగి పట్ల భర్తృహరికి అనురాగము మెండు. [మోహనాంగి అనగా మోహము కలిగించు దేహము కలది అని అర్దం.]

ఆమె అతడి మొదటి భార్య. భర్తృహరి మోహనాంగికి దివ్యఫల మహిమను వివరించి చెప్పాడు. ఎంతో ప్రేమగా “ప్రియసఖి! ఈ ఫలమును నేను ఆరగించినట్లయితే, నిత్యయవ్వనుడనై చిరకాలము జీవించగలను. కానీ నా కళ్ళ ముందు నువ్వు ఈ అందమైన రూపము వయో వృద్ద భారమై మరణిస్తావు. అది నేను భరించలేను. నాకు నీపైన అంత ప్రేమ! కాబట్టి ఈ పండును నీవు ఆరగించు” అన్నాడు.

మోహనాంగి వయ్యారంగా పండు నందుకొని ప్రక్కన ఉంచింది. మధురమైన మాటలతో, ప్రేమాస్పద చర్యలతో భర్తకు ఆనందం కలిగించింది. అయితే ఈ మోహనాంగి, భర్త పట్ల నిజమైన ప్రేమ గలది కాదు. ఆమెకు రధ సారధియైన ‘సాహిణి’ అనువానితో రహస్య ప్రేమాయణం ఉన్నది.

మరునాటి ఉదయం మోహనాంగి, రహస్యంగా సాహిణికి ఆ పండునిస్తూ దాని విశిష్టతని తెలియబరిచింది. ఈ రధసారధి ‘సాహిణి’కి రాజ ప్రసాదంలో పరిచారికగా పనిచేయ మరొక మహిళతో రహస్య ప్రేమ సంబంధం ఉంది. ఆ పరిచారిక రాజాంతఃపురాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. పేడ, మట్టితో అంతఃపుర పరిసరాలని అలికి ముగ్గులు పెడుతూ ఉంటుంది.

సాహిణి ఆ పరిచారికని ఆ రోజు సాయంత్రం కలుసుకున్నాడు. కాసేపు ఇష్టాపూర్తిగా గడిపాక, సాహిణి పరిచారికకి పండునిచ్చి, దాని ప్రత్యేకతని చెప్పాడు. ఆ పరిచారిక “సరే! ఇంటికెళ్ళి స్నానం చేశాక, ఈ పండు తింటాను” అనేసి పోయింది.

పరిచారిక పండుని పేడ గంప మీద పెట్టుకొని, గంప నెత్తిన పెట్టుకుని, ఇంటికి బయలు దేరింది. ఆమె రాజవీధిలో నడిచి పోతుండగా… అప్పుడే భర్తృహరి రాజ ప్రాసాదపు ఉప్పరిగ [మేడ] మీద చల్లగాలిని ఆస్వాదిస్తూ, పచార్లు చేస్తూ ఉన్నాడు. రోజు వారీ దినచర్య నుండి ఆ విధంగా విశ్రాంతి పొందడం రాజుకు అలవాటు.

యధాలాపంగా వీధిలోకి చూసిన భర్తృహరికి, పరిచారిక నెత్తి మీది గంపలో పేడ మీద దివ్యఫలం కనిపించింది. మరుక్షణమే దాన్ని అతడు గుర్తు పట్టాడు. అతడికి చాలా ఆశ్చర్యం కలిగింది. తాను పట్టపు రాణి కిచ్చిన దివ్యఫలం ఈ పేడ గంపలోకి ఎలా వచ్చింది?