భ్రాంతి 5 140

అది ఏ దేవుడి విగ్రహమో అర్ధం కాలేదు పెంచలయ్యకి. ‘సామీ, నిన్నమ్మేస్తాను. నన్నొగ్గెయ్యి. ఈ బీద బతుకు నాకలవాటే కానీ మనమలకైనా కూసింత సుకం గావాల. నీ పేర్జెప్పుకొని ఆ తరమైనా సల్లంగుంటాది అయ్యా’ అంటూ దానిని కళ్ళకద్దుకొని జాగ్రత్త చేసి పడుకున్నాడు.

అమ్మడానికైతే నిశ్చయించుకున్నాడు కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎంత ధనం అడగాలో తెలియరావట్లేదు పెంచలయ్యకి. రోజూ సెలయేటి ఒడ్డున కూర్చుని విగ్రహాన్ని తుడిచి చూసుకుంటూ కూర్చుంటున్నాడు. విగ్రహం చాలా విలువైనది అని అనిపిస్తోంది అతడికి. ఓ వైపు దానిని తీసుకెళ్లి గుడిలో వదలిరావాలి అనే ఆలోచన వస్తోంది. మరోవైపు చెడతిరుగుతున్న తన కొడుకు, నిస్సహాయంగా వున్న తన కోడలు, మనుమలు గుర్తొస్తున్నారు. ఈ ఆలోచనల్లో వుండగానే ఉన్నట్టుండి గొడ్లు బెదరినట్టు శబ్దాలు చేశాయి. వాటిని సముదాయిస్తుంటే కారుచీకట్లు కమ్మేసాయి.

ఆ రోజు గ్రహణం అని గుర్తొచ్చింది పెంచలయ్యకి. ఇల్లు కదలకుండా వుండాల్సింది అనుకుంటూ గొడ్లని తీసుకుపోయి చెట్టుకి కట్టేశాడు. మళ్ళీ విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తున్నాడు. విగ్రహం నుంచి ఓ వెలుగు రేఖ బయల్దేరినట్టు అనిపిస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పెంచలయ్యకి. తను మేల్కొని వున్నాడా, కలగంటున్నాడా అని గిచ్చి చూసుకున్నాడు. ఏదైతే అది అయిందనుకొని వెలుగు రేఖ వెంబడి నడుచుకుంటూ పోయాడు. చుట్టుపక్కల ఎక్కడా చూడట్లేదు పెంచలయ్య. నేలమీద కనిపిస్తున్న వెలుగురేఖ చూసుకుంటూ నడుస్తున్నాడు.

చివరకు కాళ్ళకి మెట్లు తగిలేసరికి తలెత్తి చూశాడు. శిధిలావస్థలో వున్న ఓ దేవాలయం కనిపించింది. చేతిలో వున్న విగ్రహం బరువెక్కినట్టు అనిపిస్తే దానిని ఆ మెట్ల మీద పెట్టాడు. బెరుగ్గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి చూశాడు. దేవాలయ నిర్మాణంలోని సుందరత్వాన్ని గమనించే స్థితిలో లేడు పెంచలయ్య. నోరు తెరుచుకొని అక్కడ నిలబడి వున్న విగ్రహాలను చూస్తున్నాడు. చేతికి దగ్గరలో వున్న ఓ విగ్రహానికి పట్టి వున్న బూజును దులిపాడు. అది శివుడి విగ్రహమని తోచింది అతడికి. మామూలు రాతి విగ్రహంలా లేదు అది. తన దగ్గరున్న చిన్న విగ్రహంలానే ఏదో లోహంతో పోతపోసి చేసిందనుకున్నాడు.

అక్కడ వున్నదంతా చూసి పరుగున వచ్చి మెట్లమీద వున్న విగ్రహం ముందు సాగిలబడ్డాడు. ‘సాములోరూ, నిన్నమ్మే దురాలోశన సెయ్యను, నన్నొగ్గెయ్యి. నీ మహిమ జూపించావు. ఏటి సెయ్యమంతావో సెప్పు, నీ దాసున్ని’ అంటూ వేడుకున్నాడు. ‘నాకేమీ ఇయ్యొద్దు, నా మనమల్ని సల్లంగా సూడు సామీ’ అని పరిపరివిధాల వేడుకున్నాడు. చేతనైనంత వరకూ గుడిలో విగ్రహాలను శుభ్రం చేసి వచ్చాడు. మళ్ళీ చిన్న విగ్రహంలోంచి వెలుగురేఖ కనిపిస్తే దాన్ని వెంబడి తన పశువుల దగ్గరకు చేరుకున్నాడు.

అప్పట్నుంచీ పెంచలయ్యకు మంచిరోజులు మొదలయ్యాయి. తమ కుటుంబానికే చాలీ చాలనట్లు వస్తుండే బర్రెపాలు ఇప్పుడు మిగులుచూపుతున్నాయి. ఓ రోజు ధైర్యం చేసి అంగట్లోకి తీసుకెళ్లి వాటిని అమ్ముకొచ్చాడు. ఆ రోజు పెంచలయ్య కుటుంబం అంతా తొలిసారిగా వరి అన్నం తిన్నారు. తనకు దొరికిన విగ్రహం ఎప్పుడు దారి చూపితే అప్పుడు వెళ్ళి గుడిని శుభ్రం చేసి వస్తున్నాడు పెంచలయ్య. పడిపోయిన రాళ్ళను, పెరిగిన పిచ్చిమొక్కలను తీసేసి మెల్లిగా దేవాలయాన్ని సంస్కరిస్తున్నాడు.

దేవాలయ స్థితితో పాటు పెంచలయ్య కుటుంబ స్థితి కూడా మెరుగు పడుతోంది. ఇదంతా చూస్తున్న మున్నాకు ఏదో మతలబు వుందని అనిపించింది. తన తండ్రిని జాగ్రత్తగా గమనించడం మొదలెట్టాడు. తనకివ్వకుండా ఇంకా ఎక్కడన్నా ధనం దాచివుంచాడేమో అని వెదుకులాడుతున్నాడు. ఓ రోజు తన తండ్రికి తెలియకుండా వెంబడి పశువుల కాపలాకు వెళ్ళాడు. దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఎప్పట్లానే పెంచలయ్య తన జోలెలోంచి విగ్రహాన్ని తీసి శుభ్రం చేసి దణ్ణం పెట్టుకుంటున్నాడు. అంతదూరంలోనూ విగ్రహం ధగధగలు మున్నాకు అగుపించాయి. అంత విలువైన విగ్రహం అమ్మేస్తే! దీన్ని దాటి ఆలోచన చేయలేక పోయాడు వాడు.

ఆ రాత్రి తన తండ్రి నిదురించేముందు విగ్రహాన్ని తలగడ కింద పెట్టడం చూశాడు. అర్ధరాత్రి దాటాక వచ్చి విగ్రహాన్ని తియ్యబోయాడు. అంతులేని బాధ నరనరాల్నీ మెలిపెట్టేస్తే టక్కున దాన్ని వదిలేసి పారిపోయాడు. ధైర్యం తెచ్చుకొని మర్నాడు మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి కూడా అదే అనుభవమయ్యేసరికి ప్రాణభయంతో పారిపోయాడు.

కాలగమనంలో పెంచలయ్య కుటుంబం ఆర్ధికంగా కుదురుకుంది. పాడి సంపద మూడింతలయ్యింది. ఇంటి కప్పు బాగయ్యింది. పిల్లలు తిండికి లోటు లేకుండా సంతోషంగా వున్నారు. కానీ పెంచలయ్య వయసు మీదపడుతోంది. స్వామి మహిమ వల్ల తన కుటుంబం బాగవడం చూసి సంతోషంగా వున్నాడు. అయితే తనకి ఇంత చేసిన ఆ స్వామికి కానుకగా తనకి కనిపించిన గుడిని ఉద్ధరించాలని అనుకున్నాడు. తన జీవితకాలంలో జరిగేది కాదు అని తెలుసు కాబట్టి తన కొడుక్కి ఆ పని అప్పగించాలి అనుకున్నాడు. మున్నాని కూర్చోబెట్టి తన కుటుంబం బాగవడానికి కారణమైన స్వామి మహిమను వివరించాడు. తన తర్వాత స్వామికి సేవ చెయ్యమని నూరిపోశాడు.

‘పది తరాలపాటు సల్లంగుంటాము నాయనా, నా మాట కాదనకు’ అంటూ సూర్యుడి విగ్రహం ఇవ్వజూపాడు పెంచలయ్య. ఒకసారి విగ్రహాన్ని తాకితే ఏమయ్యిందో గుర్తొచ్చిన మున్నా భయంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. పెంచలయ్య బ్రతికున్నన్నాళ్లూ ఎప్పుడు గుడికి దారి కనిపిస్తే అప్పుడు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి వచ్చాడు. పెంచలయ్య మరణించాక మున్నా తన పిల్లల చేత ఆ విగ్రహాన్ని ఊరిలోని గుడిలో వదిలేయించి వచ్చాడు. ఆ విగ్రహం అలా పూజారుల వంశీకుల వద్దకూ, అక్కడ్నుంచి గుడి ధర్మకర్తల వద్దకూ చేరింది. కాల ప్రవాహంలో తన మహిమ మళ్ళీ చూపించిందా విగ్రహం.

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.