భ్రాంతి 5 140

కాలం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు వుంది కిరీటికి. కిట్టి ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చింది. విషయం తెలిసిన తక్షణం వాడి తల్లిదండ్రులు మద్రాసు వెళ్లారు. వాళ్ళు కోపంగా కాక ప్రేమతో వాడిని ట్రీట్ చెయ్యాలి అని కోరుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోయాడు కిరీటి. చూస్తుండగానే సంవత్సరం చివరకు వచ్చింది.

ఒకసారి అలా పెంచలాపురం దాటి బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో చూసొద్దాము.

నైనిటాల్, లా విల్లా బ్లూ:
ఒక్కొక్కసారి మనం మనుషులను తప్పుడు అంచనా వేస్తుంటాము. పర్యవసానాలు ఎదురయ్యేదాకా మన తప్పు మనకి తెలిసిరాదు. ఫ్రాన్స్-వా డిసౌజా గురించి తానెంత తప్పుగా ఊహించాడో తెలుసుకున్న సుందర్ ఒక షాక్ లో వున్నాడు. తానే కాదు, అతడి దగ్గరనుండీ దొంగిలించాలని ఆలోచన చేసిన వాళ్ళంతా అదే తప్పు చేశారు. అతడి క్రూరత్వాన్ని, హద్దులెరుగకుండా తన కోపం చల్లారేవరకూ వెంటాడే అతడి తత్వాన్నీ ఎవరూ ఊహించలేదు.

ఎలా సాధించాడో తెలియదు కానీ నిజమైన మాలిని కపూర్ ను తన విల్లాలోకి రప్పించి బంధించాడు డిసౌజా. మాలినిని చూసిన సుందర్ ఆమెను తన కన్సల్టెన్సీలో అదివరకు పనిచేసి తొలగింపబడ్డ మనిషిగా గుర్తించాడు. ఈ విషయం విని డిసౌజా కళ్ళల్లో కదలాడిన భావాలు చదవలేకపోయాడు. దొంగతనం తలపెట్టడంలో తమ కన్సల్టెన్సీ పాత్ర కూడా వుందని అనుమానిస్తే దాన్ని నాశనం చెయ్యగల శక్తి వుంది ఈ డిసౌజాకి అని తెలుసుకున్నాడు ఇన్నినాళ్ళ సహవాసంలో సుందర్. తన భవిష్యత్తు గురించీ తన కంపెనీ భవిష్యత్తు గురించీ ఆందోళనలో పడ్డాడు.

తననెదిరిస్తే ఏం జరుగుతుందో తెలియజెప్పడానికి అన్నట్టు మాలినిని విచారించిన ప్రతిసారీ సుందర్ ను పక్కనే వుంచుకున్నాడు డిసౌజా. ఆ ఎత్తుగడ బాగానే ఫలించింది. ఇప్పుడు సుందర్ కలలో కూడా డిసౌజాను antagonize చేసే ధైర్యం చెయ్యట్లేదు. రాబట్టాల్సిన వివరాలన్నీ తెలుసుకున్నాక మాలినిని తన విల్లాలోంచి వేరేచోటకు మార్చాడు డిసౌజా. ఆమె fate ఏమిటనేది అడగడానికి ధైర్యం చాల్లేదు సుందర్ కు. అయితే మాలిని చెప్పిన సునయన అనే అమ్మాయి ఈ క్రూరుడి చేతిలో పడితే జరిగేది తలచుకొని ఒళ్ళు గగుర్పొడిచింది. తనని ఇబ్బందుల పాలు చేసినా కూడా సునయన ఈ దుష్టుడి చేతికి చిక్కకూడదనే కోరుకున్నాడు.

సూరత్ లోని ప్రతి కన్సల్టెన్సీకి ఓ పాఠంగా ఇక్కడ జరిగినవన్నీ సుందర్ కి చూపి వెనక్కు పంపాడు డిసౌజా. ఆ మాట బయటకు చెప్పలేదతను. కానీ డిసౌజా అంతరంగాన్ని అర్ధం చేసుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ సూరత్ తిరిగిపోయాడు సుందర్.

******************

హైదరాబాద్ చేరుకున్న సునయన ధనుంజయ్ చనిపోయేముందు తనకు రాసిన ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంది. వినయ్ కు ఉన్న అతి పెద్ద రహస్యం అతడి ఫ్యామిలి హిస్టరీ అని, అదొక్కటే బహుశా నిన్ను వాడినుంచి కాపాడుతుంది అని రాశాడు ధనుంజయ్. ఈ విషయాన్ని వాడుకొని డైరెక్ట్ గా వినయ్ ను బెదిరించాలో, లేక అతడ్ని దెబ్బతీయడానికి ఈ విషయాన్ని వేరేవాళ్ళకు చేరవేయాలో తేల్చుకోలేక పోతోంది ఆమె.

అలసిపోయిన మనసుతో వున్న ఆమెకు కిరీటి గుర్తొచ్చాడు. వాడిని ఎలాగైనా కలవాలని మనసు పీకుతోంది ఆమెకు. ఒక నిశ్చయానికి వచ్చి చిన్న పార్శిల్ తయారుచేసింది. అందులో డిసౌజా దగ్గర తీసుకున్న ఐదు వజ్రాలను, దానితోపాటు ఒక చిన్న ఉత్తరాన్ని ఉంచింది. Post office కు వెళ్ళి ఆ పార్శిల్ ను నైనిటాల్ పంపింది. పోస్ట్ ఆఫీసు నుంచి బయటకు వస్తుంటే ఎందుకో ఇద్దరు వ్యక్తులు తననే చూస్తున్నారు అని అనుమానించింది. హైదరాబాద్ లో కూడా కొన్నాళ్లు విశ్రాంతిగా ఉండే యోగం తనకు లేదేమో అనుకుంటూ కన్నీళ్లు చిప్పిల్లుతున్న కళ్ళతో అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

******************

1 Comment

  1. Bro emindhi story update em levu story apesara leka ayipoindha konchm chppndi

Comments are closed.