శృంగార శతకము 1 131

[ప్రాచీన కాలంలో పాలకులకి, సంపన్నులకి, ప్రజలకి వేట ఎంతో ప్రీతిపాత్రమైనదై ఉండేది. అప్పట్లో అరణ్యాలు దట్టంగా విస్తారంగా ఉండేవి. అడవి జంతువుల సంఖ్య, ప్రజల కంటే ఎక్కువగా ఉండేది. దాంతో ప్రజల, పెంపుడు జంతువుల ప్రాణాలకు, అడవి జంతువుల నుండి ప్రమాదం ఉండేది. జింకలూ, దుప్పుల వంటి సాధుజంతువులు పొలాల మీద పడి మేసేవి. భల్లూకాలు, కుందేళ్ళు దుంప పంటలని తవ్వి పారేసేవి. ఏనుగుల గుంపులు వంటివి, చెఱకు వంటి పైర్లను పీకి పాకాన పెట్టేవి. వాటిని నియంత్రించటానికి వేట అనివార్యమై ఉండేది. ఇప్పటి స్థితి దీనికి విపర్యయం. ఇప్పుడు అడవుల కంటే అడవి ప్రాణుల కంటే జనాల సంఖ్య ఎక్కువ! ఇప్పుడు మనిషి నుండి జంతువులకి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అడవులని సంరక్షించడం, అడవి జంతువులని సంరక్షించడం అనివార్యమైంది. కాబట్టి ఇప్పుడు వేట నిషిద్దం. అప్పుడు వేట వినోదం!]

అడవిలో భోజరాజు, అతడి పరివారమూ వారం రోజుల పాటు వేట కొనసాగించారు. అడవిలో కౄర, వన్యమృగాల సంఖ్య నియంత్రణలోకి వచ్చిందని రాజుకు తోచింది. వేట ముగించాలని నిర్ణయించాడు. మరునాటి ఉదయాన్నే…. భోజరాజు, తన పరివారంతో కలిసి తన రాజధానియైన ధారా నగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వేటాడి సంపాదించిన దుప్పికొమ్ములు, పులిచర్మాలు వంటి వస్తువులని గుర్రాలపై వేశారు. ప్రయాణం ప్రారంభించారు. ఆ రోజున ఎండ మండిపోతోంది. నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుంది. వారం రోజులుగా వేటలో అలిసిపోయిన భోజరాజు, సూర్యతాపానికి మరింత అలసటకి గురై, గుర్రపు స్వారి మాని, పల్లకిలో ప్రయాణించసాగాడు.

అతడి పరివారంలోని సైనికులు, యువకులూ కూడా ఎండ బడలికల కారణంగా నెమ్మదిగా నడవసాగారు. దారిలో వాళ్ళు ఓ పొలం ప్రక్కగా వెళ్ళసాగారు. పచ్చని పైరుతో ఆ పొలం నిండుగా ఉంది. అది శరవణ భట్టు అనే బ్రాహ్మణుడది. [సాధారణంగా ‘శరవణ’ అన్న పేరు తమిళులకు ఉంటుంది. భోజరాజు పరిపాలించిన రాజ్యం, మధ్య భారతదేశంలో, తమిళనాడు దాకా విస్తరించి ఉందేమో ‘నిజమైన చరిత్ర’ తెలిసిన చరిత్రకారులకి తెలియాలి.] శరవణ భట్టు తన పొలంలో పంటని జంతువుల బారి నుండి, పక్షుల బారి నుండి కాపాడుకోవటానికి, పొలం మధ్య ఎత్తుగా మంచె కట్టుకున్నాడు. అదీగాక, మంచె మీద కూర్చుని పొలానికి కావలి కాయటం సులభం కూడాను.

భోజరాజు, పరివారమూ పొలం ప్రక్కగా సాగుపోతున్నప్పుడు, శరవణ భట్టు ఆ మంచె మీదే ఉన్నాడు. అతడు వారిని చూసి “ఓ యన్నలారా! చూస్తే మీరు దూరం నుండి వస్తున్నట్లున్నారు. అలిసిపోయి ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొండి. ఈ పొలం గట్టున నేనో చింత చెట్టు పెంచాను. ఆ చెట్టు నీడలో రవ్వంత సేపు విశ్రమించండి. ప్రక్కనే దిగుడు బావి ఉన్నది. అందులో నీళ్ళు చల్లగా, తియ్యగా ఉంటాయి. చూస్తే మీరంతా బాగా ఆకలితోనూ, దాహంతోనూ ఉన్నట్లుగా తోస్తోంది. మా బావి నుండి చల్లని నీటిని తాగండి. పొలంలో నేను మొక్కజొన్న పంట వేసాను. పైరు ఏపుగా ఎదిగి కంకి బట్టి ఉంది. కంకులు పాలుబట్టి ఉన్నాయి. కడుపునిండా తినండి. మొక్కజొన్న కంకులు మీకు నచ్చకపోతే…. చాళ్ళ మధ్యన దోసపాదులు పెంచాను. దోస కాయలు దోరగా పండి, పగుళ్ళు వారి ఉన్నాయి. పనసతొనల్లా తీయగా, సువాసన వీనుతున్నాయి. ఆకలి దప్పలూ అలసటా, తీర్చుకుని, అప్పుడు పోదురు గానీ, కాస్సేపు ఆగండి” అన్నాడు. భోజరాజు,

అతడి పరివారమూ ఈ మాటలు విని ఎంతో సంతోషించారు. తన రాజ్యంలోని సామాన్య రైతు సైతం, ఇంతటి వితరణ గుణం కలిగి ఉన్నందుకు రాజుకు సంతృప్తి కలిగింది. అతడు తన పరివారానికి, మొక్కజొన్న కంకులూ, దోసకాయలూ తినడానికి, చేలోని బావినీరు తాగటానికీ అనుమతినిచ్చాడు. ఉత్సాహంగా సైనికులూ, యువకులూ, పల్లకీ బోయిలూ పొలంలో జొరబడి ఆకలిదప్పలు తీర్చుకోసాగారు. కొన్ని నిముషాలు గడిచాయి. ఇంతలో శరవణ భట్టు మంచె దిగి క్రిందికొచ్చాడు. అంతే! ఒక్కసారిగా గావుకేక పెట్టాడు. “ఏయ్! ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు? నా పంటంతా ఎందుకు నాశనం చేస్తున్నారు? చూడబోతే రాజుగారి సైనికుల్లా ఉన్నారు! దొంగల్లా పొలంలో చొరబడి పంటంతా తినేస్తున్నారే!? మిమ్మల్ని కట్టడి చేసేందుకు గానీ, శిక్షించేందుకు గానీ ఎవరూ లేరా? నాలాంటి అమాయక రైతులకి, ఇంకెవరికైనా కష్టం కలిగిస్తే, రాజు గారి దగ్గరికెళ్ళి న్యాయం చెయ్యమని మొరపెట్టుకుంటాము. అలాంటిది… రాజూ, అతడి పరివారమే, నాలాంటి వాడికి అన్యాయం చేస్తే, ఇంకెవరి దగ్గరి కెళ్ళి మొత్తుకోవాలి? పేద బ్రాహ్మణుడి పంట దోచుకునే పాపానికి ఒడిగట్టారు. మిమ్మల్ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు” అంటూ శాపనార్దాలు పెడుతూ అరవసాగాడు.