శృంగార శతకము 1 131

ఈ నేపధ్యంలో…. కథాపూర్వకంగా చెప్పబడే ఇలాంటి మంచి భావనలు, చిన్నారులలో బలంగా నాటుకుంటాయి. సింహాసనం మీది బొమ్మలు ‘పోతే పోనీ! సింహాసనాన్ని భోజరాజు ఎక్కితే ఎక్కనీ’ అనుకుంటే భట్టి విక్రమార్క కథలే ఉండేవి కాదుగదా!]

ఇది విని భోజరాజు ఆశ్చర్యచకితుడైనాడు. సభలోని వారెల్లరూ ఈ విడ్డూరాన్ని చూసి శిలాప్రతిమల్లా అప్రతిభులైనారు. కొన్ని క్షణాల తర్వాత భోజరాజు “ఓ ప్రతిమామణీ! వినోద రంజితా! నీవింత వరకూ విక్రమాదిత్య మహరాజు గురించి చెప్పితివి. ఎవరా మహరాజు? అతడి చరిత్ర ఏమిటి? ఆయన గుణగణాలెటు వంటివి? నేనది తెలియగోరుచున్నాను. నీకు సమ్మతమైతే, భట్టి విక్రమాదిత్యుల గురించిన మా కుతుహలాన్ని, ఆసక్తిని మన్నించి, ఆ వివరాలు మాకు చెప్పవలసిందిగా నా కోరిక!” అని మృదువుగా పలికాడు.

వినోద రంజిత ప్రతిమ అంగీకార సూచకంగా తలాడించింది. సభాసదనమంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఆశ్చర్యంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, మనసంతా చెవులుగా పరుచుకొని కథ వినేందుకు సంసిద్దలుయ్యారు. వినోద రంజిత భోజరాజు వైపు సాదరంగా చూస్తూ “భోజరాజా! ఇప్పుడు నేను విక్రమాదిత్య మహరాజుకు పూర్వగాధ చెప్పబోతున్నాను. సావధానుడవూ, భక్తి వినమ్రుడవూ అయి వినెదవు గాక….” అంటూ ఇలా చెప్పసాగింది.

ప్రాచీన కాలంలో, కర్మభూమియైన భారత ఖండంలో నంది పురమనే పట్టణ ముండేది. అందులోని బ్రాహ్మణ వాడలో, మిగుల సౌందర్యవంతుడైన యువకుడు ఒకడుండేవాడు. అతడి పేరు చంద్రవర్ణుడు. [చంద్రవర్ణుడు అంటే – చంద్రుని కాంతి వంటి శరీర ఛాయ గలవాడు అని అర్ధం.] చంద్రవర్ణుడు మంచివాడు. నీతి నియమాలు, ధర్మచింతనా గలవాడు. పైగా పండితుడు. అతడెన్నో శాస్త్రాలనూ, కళలనూ అభ్యసించాడు. అయినా గానీ, తాను నేర్చిన విద్యల పట్ల అతడికి సంతృప్తి లేదు.

“ఈ జగత్తున ఇంకనూ నేర్వవలసిన కళలూ, శాస్త్రాలూ, విద్యలూ ఎన్నిగలవో ఎవరూ చెప్పలేరు. నేనింకా నేర్వవలసింది ఎంతో ఉంది. ఇలాగే ఉంటే నా తృష్ణ తీరదు. సద్గురువును ఆశ్రయించి, విద్యల నభ్యసించవలసిందే” అని నిశ్చయించుకున్నాడు.

స్థిర నిశ్చయానికి వచ్చిన చంద్రవర్ణుడు ఇల్లు విడిచి పెట్టాడు. సద్గురువుని అన్వేషిస్తూ బయలు దేరాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. పుణ్యక్షేత్రాలు చుట్టబెట్టాడు. విద్వాంసులున్నారని పేరున్న చోటునల్లా సందర్శించాడు. తన జ్ఞానతృష్ణని తీర్చే గురువుని కనుక్కోలేక పోయాడు. అయితే చంద్రవర్ణుడు తన సంకల్పాన్ని మాత్రం విడిచి పెట్టలేదు.

సద్గురు అన్వేషణనీ మానలేదు. ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా సాగుతూ… ఒక నిర్జనారణ్యాన్ని చేరాడు. అతడప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాడు. అతడికి ఎదురుగా చిన్న కొండ ఉంది. ఆ ప్రక్కనే ప్రశాంతంగా ఓ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున ‘ఆకాసాన్నంతటినీ ఆవరించి ఉందా?’ అన్నట్లు రావి చెట్టొకటి ఉంది. నది నీటి గలగలలతో, రావి ఆకుల గలగలలు పోటీ పడుతున్నాయి.

చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకున్నాడు. ఆ చల్లని నీటిలో స్నానమాచరించాడు. అలసిన శరీరం, మనస్సు కూడా సేదతీరాయి. రావి చెట్టు క్రింద చేరగిలబడ్డాడు. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. చంద్రవర్ణుడు విశ్రాంతిగా ఆ చెట్టు నీడలో నిద్రించాడు.

భారీగా ఉన్న ఆ రావి చెట్టు మీద, చాలా కాలం నుండీ ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. [రాక్షసులు తామస గుణాత్ములు. వారిలో సత్వగుణం గల రాక్షసులని బ్రహ్మరాక్షసులంటారు. రాక్షసులలో వీరు మహర్షుల వంటి సాధు పురుషులన్న మాట.] అతడా రావి చెట్టు కొమ్మలపై ఉంటూ, ప్రతీరోజూ తపమాచరిస్తూ ఉన్నాడు. సంధ్యా వందనం చేసుకోవటానికి బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చాడు. నది వైపు అడుగులు వేయబోయి, చెట్టు నీడన నిద్రిస్తున్న చంద్రవర్ణుణ్ణి చూశాడు.