శృంగార శతకము 1 131

ఆ బ్రాహ్మణ యువకుడి ముఖ వర్ఛస్సు, దేహకాంతిని బట్టి అతడి జ్ఞానతృష్ణని గ్రహించాడు. సుందరుడూ, సుకుమారుడూ అయిన చంద్రవర్ణుడి పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలిగింది. నదిలో స్నానాదికాలు ముగించుకొని, సూర్య భగవానుడికి సంధ్యావందనాది అనుష్టానాలు ఆచరించి, చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చాడు. అతణ్ణి తట్టి లేపాడు.

నిద్రలేచిన చంద్రవర్ణుడు, ఎదురుగా ఉన్న బ్రాహ్మ రాక్షసుడిని చూసి, నమస్కరించి నిలబడ్డాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడి వైపు ప్రేమగా చూస్తూ “వత్సా! ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యానికి ఎందుకు వచ్చావు? మానవ మాత్రులెవరూ ఈ దుర్గమారణ్యంలోకి అడుగు పెట్టేందుకు సాహసించరే? నీవెందుకు వచ్చావు?” అని అడిగాడు.

చంద్రవర్ణుడు వినమ్రత ఉట్టిపడే స్వరంతో “మహాత్మా! నా పేరు చంద్రవర్ణుడు. ‘నందిపురం’ అనే పట్టణ వాసిని. నన్ను ఉద్దరించగల సద్గురువును అన్వేషిస్తూ తిరుగుతున్న వాడిని! నా దురదృష్టం కొద్దీ, నా ప్రయత్నాలు సఫలం కాలేదు. చూడగా మీరెవ్వరో, పండితుల వలె కనబడుతున్నారు. మీ ముఖ కాంతి, జ్ఞానదీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దయ ఉంచి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి” అన్నాడు.

బ్రహ్మరాక్షసుడికి, చంద్రవర్ణుడిపై కలిగిన వాత్సల్యం, అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యింది. ఎంతో దయగా “నాయనా! తప్పకుండా నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తాను. భగవంతుడే నిన్ను నా దగ్గరికి పంపినట్లున్నాడు. నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు ఆరునెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది” అని ఆగాడు.

చెప్పమన్నట్లుగా చేతులు జోడించాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడు కొనసాగిస్తూ “ఆరునెలలు పాటు నువ్వు ఆకలిదప్పలు, అలసటా మరిచిపోవాలి. అన్నపానాదులు, నిద్రా విశ్రాంతులు మాని, అనుశృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యలు నేర్పగలను” అన్నాడు.

చంద్రవర్ణుడు ఆందోళన నిండిన కళ్ళతో, గురువు పాదాల మీద వ్రాలాడు. “స్వామీ! అందుకు తగిన తరుణోపాయం మీరే చెప్పండి” అని ప్రార్దించాడు. బ్రహ్మరాక్షసుడు అతడి పట్ల మరింత సంప్రీతుడై “నాయనా! దిగులు చెందకు. నేను నీకో మంత్రోపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు ఆరునెలలుపాటు తరగని శక్తి లభిస్తుంది. దాని సహాయంతో నీవు అలసట, నిద్ర, ఆకలి, దప్పికలని నియంత్రించుకోగలవు. నేనీ రావిచెట్టు కొమ్మలపై కూర్చుండి, రావి ఆకులపై శ్లోకములను వ్రాసి క్రింద పడవేస్తాను. నీవా ఆకులని గ్రహించి, వాటిపై శ్లోకములను పఠించవచ్చు” అన్నాడు.

[ప్రాచీన కాలంలో కాగితాలు లేవు కదా! తాటి ఆకులపై పక్షి ఈకతో వ్రాసేవారు. ఈ కథలో రావి ఆకుల మీద వ్రాసారు. అందుకేనేమో “ఫలానా వారి కంటే ఇతడు నాలుగాకులు ఎక్కువే చదివాడు” అనే సామెత పుట్టింది. ఒకరిని మించిన వాడు మరొకడు తారసిల్లి నప్పుడు, తరచుగా ఈ సామెత వాడుతుంటారు.]

చంద్రవర్ణుడి సంతోషం అవధులు దాటింది. బ్రహ్మరాక్షసుడికి గురుభావంతో, వినయంగా, తలవంచి నమస్కరించాడు. విద్యాభ్యాసం ప్రారంభమైంది. నిద్రాహారాలు లేకుండా బ్రహ్మరాక్షసుడు విద్యల నేర్పుతున్నాడు, చంద్రవర్ణుడు నేర్చుకుంటున్నాడు. ఆరునెలల కాలం గడిచింది.

అప్పుడు సంభవించిందొక అద్భుతం!

ఆకాశం నుండి దేవరధం రెక్కలల్లార్చుతూ దిగి వచ్చింది. బ్రహ్మ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు. చంద్రవర్ణుడు సంభ్రమంగా చూస్తూన్నాడు.

ఆ దివ్యపురుషుడు చంద్రవర్ణుడు వైపు తిరిగి “ప్రియ శిష్యా, చంద్రవర్ణా! నేనొక యక్షుడను. సకల శాస్త్రాలూ నేర్చిన వాణ్ణి. అయితే దురదృష్టవ శాత్తూ ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది. విద్యా గర్వాంధుడినై మహర్షులని అగౌరవించాను. కోపోద్రిక్తులై వారు, నన్ను ‘రాక్షసుడవు కమ్మని’ శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్దించగా, దయతో వాళ్ళు నాకు శాపవిమోచనం అనుగ్రహించారు. యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చెయ్యవలసిందిగా చెప్పారు. ఆనాటి నుండి, ఈ రావి చెట్టుపై నివసిస్తూ, తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ, తపమాచరిస్తూ కాలం నడుపుతున్నాను.

నా భాగ్యమా అన్నట్లు, దైవమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు. జ్ఞానతృష్ణతో నీవు నన్ను వెదుక్కుంటూ వచ్చావు. వినయ విధేయలతో విద్యార్జన చేశావు. నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తుడ నైనాను.