భ్రాంతి 4 100

మూట అందుకుందామని ఆటోమాటిగ్గా సిద్ధమయ్యాడు. కానీ వాడి కాళ్ళు, చేతులు వాడి స్వాధీనంలో లేవు. ముసలాయన చేతిలో మూట కోసం వెళ్దామని అనుకుంటుంటే వాడి కాళ్ళు వేరేవైపుకి లాక్కుపోతున్నాయి. ఆ పెద్దాయన ముఖంలోని భావాల్ని చూసి వాడికి బాధేసింది. కానీ వాడున్న శరీరం వెనుతిరిగి అలా వెళ్లిపోయింది. కిరీటి మనసు మాత్రం ముసలాయన చేతిలో వున్న మూట మీదే వుండిపోయింది. అయస్కాంతంలా మనసులో ఆలోచనలు దానివైపు లాగేస్తున్నాయి.

అక్కడితో ఆ కల ఆగిపోయి మరొకటి మొదలైంది. ఇది కలలా అనిపించలేదు వాడికి. ఇందాక వచ్చిన దానిలాగా ప్రపంచం సిల్కు తెర లోంచి చూసినట్టు లేదు. చాలా క్లియర్ గా వున్నాయి వాడికి కనిపిస్తున్న దృశ్యాలు. తిరుమల కొండ మీద తను, తన ముగ్గురు స్నేహితులు వున్నారు. ఇంతలో దృశ్యం మారింది. నలుగురు స్నేహితులూ ఒక ఆఫీసు లోంచి బయటకు వస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా వున్నారు. ఆఫీసు బైట బోర్డు మీద అక్షరాలు గుర్తుపట్టలేకున్నాడు. మళ్ళీ దృశ్యం మారింది. ఈసారి ఒక రైల్వే platform మీద కూర్చోని వున్నాడు తను. చేతి వేళ్లమీద ఒక coin ను తిప్పుతున్నాడు. హఠాత్తుగా సునయన వాడిని వెనకనుంచి వాటేసుకుంది. ఆ షాక్ కి కల చెదిరిపోయింది.

మర్నాడు నిద్ర లేచేసరికి వాడికి తలంతా దిమ్ముగా వుంది. ఎవరితోనన్నా వాడికొస్తున్న ఈ కలల గురించి చెప్పితీరాలి అనుకున్నాడు. పిచ్చాడి కింద జమ కట్టకుండా తన మాట వింటుంది అనే నమ్మకంతో చివరికి శైలుతో ఈ విషయాన్ని పంచుకుందామని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా తయారయ్యి వచ్చి చూస్తే బయట వాళ్ళ నాన్న గోరుతో మాట్లాడుతున్నాడు. ‘ఏరా, ఇంత పొద్దున్నే వచ్చేశావే? ఇంకా చాలా టైముంది కదా కాలేజీకి’ అన్నాడు.

గోరు ఎందుకో చాలా agitated గా వున్నాడు. ‘ఓ సారి నా రికార్డ్ సూద్దువు నాకూడా రా’ అంటూ తనతో తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్లకుండా రంగ ఇంటివైపుకి దారితీశాడు. నిజానికి రికార్డులు క్రితం వారమే ఇచ్చేశారు. మాట్లాడాలి అనుకుంటున్న విషయం వాళ్ళ నాన్నకి తెలియకుండా ఈ ఎత్తు వేశాడని అర్ధం చేసుకున్న కిరీటి ఎదురు ప్రశ్నలు వేయకుండా వాడితో వెళ్ళాడు. ముగ్గురు మిత్రులూ ఓ చోట చేరాక గోరు అసలు విషయం చెప్పడం మొదలెట్టాడు.

‘కిట్టి ఉత్తరం రాశాడ్రా. శానా ఇబ్బందుల్లో ఉన్నాడంట. ఇంటికొత్తే చమడాలెక్కదీస్తారని భయపడతాండు. ఏటన్నా సెయ్యకపోతే ఆడు ఏమైపోతాడో అనిపిస్తాంది’ అనేసరికి మిగతా ఇద్దరూ నోరెళ్ళబెట్టారు. ‘ఎప్పుడొచ్చిందిరా ఉత్తరం? ఎక్కడున్నాడు, ఇదివరకెప్పుడైనా రాశాడా ఇలాగ?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. గోరు అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఇదే మొదటిసారి ఉత్తరం రాయడం ఇలాగ అన్నాడు.

‘ఇంతకీ ఎక్కడున్నాడ్రా వాడు’ అని రంగ అడిగితే ‘తిరుపతిలో’ అన్నాడు గోరు. ఆ మాట వినగానే కిరీటి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కిట్టి రాసిన ఉత్తరాన్ని మిగతా ఇద్దరూ కూడా చదివారు. కిట్టి నిరాశ మొత్తం ప్రతిఫలిస్తోంది ఉత్తరంలో. ఇంటిని, మిత్రులని, ఊరిని ఎంత మిస్ అవుతున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది అందులో. ఎట్టి పరిస్థితుల్లోనూ తనవారికి ఈ ఉత్తరం విషయం చెప్పొద్దని బతిమాలుకున్నాడు. చెప్పినా ఉపయోగం వుండదని, ఎక్కువ రోజులు తిరుపతిలో వుండనని రాశాడు.

‘రేయ్, ఇది మనం తేల్చే ఇసయం కాదురా, ఆడి అమ్మా అయ్యలకి సెబితే తిరపతి ఇడిసే ముందే ఆడ్ని అట్టుకొత్తారు’ అన్నాడు రంగ. అందరూ కలిసి కిట్టి ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేరు. అందరూ కొన్ని రోజులు ఊరెళ్లారని తెలిసింది. ‘ఇప్పుడెట్టరా, ఆడు తిరపతి దాటితే మల్లీ ఎప్పుడు ఉత్తరం రాయాల, మనకెప్పుడు సేరాల?’ అన్నాడు గోరు. కిరీటి అదురుతున్న గుండెతో ‘మనం తిరుపతి వెళ్దామురా. వాడిని ఏదో రకంగా నచ్చజెప్పి ఇంటికి తీసుకొద్దాము’ అన్నాడు. పొద్దున వచ్చిన కల ఎంతవరకూ నిజం అవుతుందో చూడాలి అనుకుంటున్నాడు వాడు.

బ్రహ్మోత్సవాలు చూసొస్తామని ఇళ్ళల్లో చెప్పి ఒప్పించి తిరుపతి చేరారు మిత్రులు. వచ్చేముందు శైలుతో తన కలల విషయం చెప్పాలా వద్దా అని కొట్టుకులాడి తనకొచ్చిన కల ఎంతవరకూ నిజమౌతుందో చూసిన తర్వాత మాట్లాడదాం అని వాడికి వాడే సమాధానం చెప్పుకొని వచ్చాడు కిరీటి.

ఉత్తరంలో కిట్టి ఒక సత్రం అడ్రెస్ రాశాడు. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే కొద్ది రోజుల క్రితం వరకూ ఒక నాటకాల కంపెనీ వాళ్ళు ఆ సత్రంలో వున్నట్టు తెలిసింది. ఇప్పుడెక్కడున్నారో తెలీదన్నాడు వాళ్ళతో మాట్లాడిన మనిషి. డీలా పడ్డా ముందు తిరుమల కొండకి పోయి దర్శనం చేసుకొని తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అనుకున్నారు. దర్శనం అయిపోయాక వేయి స్తంభాల మండపంలో కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించుకుంటున్నారు. పక్కగా కూర్చున్న వాళ్ళు సాయంత్రం జరిగే సాంస్కృతిక ప్రదర్శనల గురించి మాట్లాడుకుంటున్నారు. నాటకం అనే పదం వినబడగానే చెవులు రిక్కించి విన్నారు మిత్రులు ముగ్గురూ. ప్రదర్శనలు ఎక్కడ జరుగుతాయో కనుక్కుని అక్కడికి పరుగెత్తి పోయారు.

అక్కడ జరిగిన నాటక ప్రదర్శనలో ఎట్టకేలకు కిట్టిని చూశారు. దాదాపు సంవత్సరం తర్వాత మిత్రుడ్ని చూసి ఆనందించారు. కానీ అదొక్కటే ఆనందం. ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకంలో మళ్ళీ చిన్న భటుడి వేషంలో చూశారు వాడిని. డైలాగులు లేవు, మనిషి పీక్కుపోయి వున్నాడు. జనంలో కూర్చుని వున్న మిత్రులని గుర్తించలేదు వాడు. నాటకమైపోయాక వాడిని కార్నర్ చేశారు. స్నేహితుల్ని చూడగానే భోరున ఏడ్చాడు కిట్టి. తనవాళ్లు ఎవరన్నా వచ్చారేమో అని భయంగా చుట్టుపక్కల చూశాడు.

వాడిని సమాధానపరిచి తమతో లాక్కెళ్లారు. ముందు కాసేపు ఇంట్లోనుంచి ఇలా వచ్చేసినందుకు చీవాట్లు పెట్టారు ముగ్గురూ. కొంత సర్దుకున్నాక మెల్లిగా వాడినుంచి జరిగిన విషయాలు రాబట్టారు. నాటకాల మోజుతోనే రాములు గ్రూపుతో కలిసి పారిపోయాడు కిట్టి. ఇంట్లో చెబితే ససేమిరా ఒప్పుకోరని ఈ పని చేశానన్నాడు. మోజు వుంది కానీ దానికి తగ్గ టాలెంటు లేకపోయేసరికి నటకుడిగా కాక extra గా మిగిలిపోయానని చెప్పుకుని వాపోయాడు.