సాక్షాత్కారం అయ్యింది 110

మకరధ్వజుని దివ్యజ్ఞాన సంపన్నునిగా తీర్చిదిద్దారు హనుమ.
కానీ సీతాదేవి వనాలకెళ్లారనే చింత ఎప్పూడు హనుమ మదిని తొలిచివేసేది.
అప్పుడు రామాయణాన్ని సంస్కృతంలో తన గోళ్ళతో గాజు పలకలపై రాశారు హనుమ. దాన్ని చూస్తూ ఆనందంగా ఉండేవారు మకరధ్వజుడు. ఇద్దరు కొన్ని ధర్మ విషయాలపై తర్కించేవారు. రాసిన వాటిని కొండలోని గుహలో భద్రపరిచేవారు హనుమ.
ఇంతలో వాల్మీకి రామాయణం లవకుశుల ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. ఒకసారి ఆ కొండ వద్దకు వాల్మీకి మహర్షి వచ్చి “హనుమపుత్రా, నాన్నగారిని కలవాలి “అని అడిగాడు.
ఇద్దరూ హనుమంతుల వారి వద్దకు వెళ్ళారు. అప్పుడు వాల్మీకి, స్వామీ మీరు రచించిన రామాయాణాన్ని ఒకసారి చూడాలని మనసు కుతూహలంగా ఉంది అన్నారు. మకరధ్వజుడు ఆ రాతి పలకలను వాల్మీకికి చూపించాడు .
సూర్యభగవానుని ప్రియశిష్యుడు, జ్ఞానభాండాగారం అయిన హనుమంతుల వారి పాండిత్యం వాల్మీకిని విస్మయపరిచింది. తన రామాయణం సాదాసీదాగా అనిపించింది. వెంటనే వాల్మీకి “స్వామి నా జీవితం మొత్తం వెచ్చించి రామాయణం రచించాను కానీ మీ రామాయణంలో రెండు పద్యాలు చదివాను నా జన్మ తరించిపోయింది. దీని ముందు నా రామాయణ రచన వృధా, దీన్ని ఇక్కడే ఉంచుతాను. మీ రామాయణం ప్రజలలోకి వెళ్ళాలి ఎందుకంటే అందులో ప్రాణం ఉంది “అన్నాడు.
హనుమ మకరధ్వజునితో “వాల్మీకి మహర్షి తన సర్వస్వాన్ని ధారపోసిన ఈ కావ్యం రాశాను. నేను మామూలుగానీ ఈ కావ్య౦ రాశాను, నా రామాయణం ఉన్నా లేకపోయినా నేను సీతమ్మ వరం వల్ల రామభక్తులను కాపాడుతూ చిరంజీవిగా ఉంటాను , కాబట్టి వాల్మీకి రామాయణం ప్రజలలోకి వెళితే అతని జీవితానికి సార్ధకత వస్తుంది “అన్నారు ప్రశాంతంగా .వాల్మీకి వద్దన్నా వినకుండా హనుమ ఆ రామాయణ ఫలకాలను సముద్రునికి రాముని పేరుతో అంకితం చేశారు.
అప్పుడు వాల్మీకి “దేవా, మీరు కారణజన్ములు, నేను మళ్ళీ పుట్టి మీ రామాయణాన్ని వెలికితీసి అందరికీ ఆ మధురరసం రుచి చూపిస్తాను “అని వీడ్కోలు తీసుకున్నారు.
తన నాయనమ్మను, తాతయ్యను తన తండ్రి పుట్టిన గడ్డను చూడడానికి మకరధ్వజుడు కిష్కింధకు వెళ్ళాడు.
అక్కడనుండి పాతాళలోకం వెళ్ళి తన రాజ్యాన్ని, ప్రజలను వృద్ధి చేసి తండ్రికి తగ్గ తనయునిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇది మత్స్యవల్లభుని కధ.

మత్స్యవల్లభుడు తన తండ్రి హనుమంతుడు గురించి ఇలా చెప్పాడు.
నా జీవితం లో మర్చిపోలేని సంఘటన ఒకటి మీకు చెబుతాను .సీతమ్మ వారిని భూదేవి తనలో తీసుకుపోయింది.రాములవారు ఆపడానికి ప్రయత్నించారు .సమయం చేదాటిపోయింది .సీతమ్మ తల్లి కురులనుండి వట్టివేర్లు మొలిచాయి .ఆమె జుట్టు నిమిరినట్టు ఆ వేళ్ళను రాములవారు శోకం తో నిమురుతున్నాడు. ప్రజలు విధి తమతో ఆడిన వింత నాటకం చూస్తూవున్నారు. ప్రజలు అంత పెద్దరాముడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు .రామునికి ఓదార్పు ఎలా అడగాలో తెలియలేదు. బాధాతప్త హృదయం తో తన పరిస్థితి కి ఎవ్వరిని నిందించక కుశ లవులకు రాజ్య విషయాలు అప్పగించి ఒంటరిగా తన మందిరం లో కూర్చున్నాడు.